Halloween Costume ideas 2015
February 2017

చిన్నపిల్లవాడు దేవుణ్ణి సేవించడం


ఈ చిన్నపిల్లవాడు అందంగా కనిపిస్తున్నాడు కదా? ఆయన పేరు సమూయేలు. సమూయేలు తలపై చేతులుంచిన వ్యక్తి ఇశ్రాయేలు ప్రధాన యాజకుడైన ఏలీ. సమూయేలును ఏలీ దగ్గరకు తెచ్చింది తండ్రి ఎల్కానా మరియు తల్లి హన్నా.




ప్రధాన యాజకుడైన ఏలీ దగ్గరకు వచ్చిన సమూయేలుసమూయేలు అప్పుడు కేవలం నాలుగు లేక ఐదు సంవత్సరాల వయస్సువాడే. ఇక్కడ యెహోవా మందిరంలోనే ఏలీతోను ఇతర యాజకులతోను ఉండడానికి వచ్చాడు. ఎల్కానా మరియు హన్నా ఇంత చిన్నపిల్లవాడైన సమూయేలును యెహోవా మందిరంలో సేవ చేయడానికి ఎందుకు ఇస్తున్నారు? మనం చూద్దాం.
ఇలా జరగడానికి కొన్ని సంవత్సరాల ముందు హన్నా ఎంతో దుఃఖంతో ఉండేది. దానికి కారణం ఆమెకు సంతానం కలుగకపోవడమే. తనకు ఒక బిడ్డ కావాలని ఆమె ఎంతో కోరుకుంది. అలా ఉండగా ఒకరోజు హన్నా యెహోవా మందిరానికి వచ్చి, ‘యెహోవా నన్ను మరువకుము! నీవు నాకు కుమారుణ్ణి అనుగ్రహిస్తే, అతను తన జీవిత కాలమంతా నీకు సేవ చేయడానికి అతన్ని నీకు సమర్పిస్తాను అని ప్రమాణం చేస్తున్నాను’ అని ప్రార్థించింది.
యెహోవా హన్నా ప్రార్థనకు సమాధానమిచ్చాడు, కొన్ని నెలల తరువాత ఆమెకు సమూయేలు పుట్టాడు. హన్నాకు తన చిన్న బాబు అంటే ఎంతో ఇష్టం, అతను చాలా చిన్నగా ఉన్నప్పుడే ఆమె అతనికి యెహోవా గురించి బోధించడం ప్రారంభించింది. ఆమె తన భర్తతో, ‘సమూయేలు పెద్దవాడై, పాలు విడిచిన వెంటనే, అతను యెహోవాను సేవించడానికి నేను అతనిని మందిరానికి తీసుకువెళ్తాను’ అని చెప్పింది.
హన్నా మరియు ఎల్కానా అలా చేయడాన్నే మనమిక్కడ చిత్రంలో చూస్తున్నాం. సమూయేలు తలిదండ్రులు అతనికి చక్కగా బోధించారు కాబట్టి అతను యెహోవా గుడారంలో ఆయనను సేవించగలుగుతున్నందుకు చాలా సంతోషించాడు. ప్రతి సంవత్సరం హన్నా మరియు ఎల్కానా ఈ ప్రత్యేక గుడారంలో ఆరాధించడానికి, తమ కుమారుణ్ణి చూడడానికి వస్తుండేవారు. హన్నా ప్రతి సంవత్సరం సమూయేలు కోసం చేతులులేని ఒక క్రొత్త చొక్కాను తయారుచేసి తీసుకొనివచ్చేది.
అలా సంవత్సరాలు గడిచే కొలది సమూయేలు యెహోవా మందిరంలోనే సేవ చేస్తూ ఉండేవాడు, ప్రజలూ అలాగే యెహోవా ఆయనను ఎంతగానో ఇష్టపడేవారు. అయితే ప్రధాన యాజకుడైన ఏలీ కుమారులు హొఫ్నీ, ఫీనెహాసు మంచివాళ్ళు కాదు. వాళ్ళు చాలా చెడ్డపనులు చేస్తూ, ఇతరులు కూడా యెహోవాకు అవిధేయత చూపించడానికి కారణమయ్యేవారు. ఏలీ వాళ్ళను యాజకుల స్థానం నుండి తీసివేయాలి, కానీ ఆయన తీసివేయలేదు.
గుడారంలో జరుగుతున్న చెడు కార్యాల కారణంగా సమూయేలు యెహోవాను సేవించడం ఆపుచేయలేదు. యెహోవాను ప్రేమించే వాళ్ళు చాలా తక్కువమంది ఉన్నారు కాబట్టి యెహోవా మానవులతో మాట్లాడి చాలా కాలమయ్యింది. సమూయేలు కొంచెం పెద్దవాడైనప్పుడు ఇలా జరిగింది:
సమూయేలు గుడారంలో నిద్రిస్తున్నప్పుడు ఒక స్వరం ఆయనను నిద్ర లేపింది. అప్పుడు ఆయన, ‘చిత్తము’ అని సమాధానమిచ్చి, లేచి ఏలీ దగ్గరకు పరుగెత్తుకొని వెళ్ళి, ‘మీరు నన్ను పిలిచారు కదా, నేను వచ్చాను’ అన్నాడు.
అయితే ఏలీ, ‘నేను నిన్ను పిలువలేదు. వెళ్ళి పడుకో’ అని చెప్పాడు. కాబట్టి సమూయేలు వెళ్ళి పడుకున్నాడు.
తర్వాత రెండవసారి, ‘సమూయేలు!’ అనే పిలుపు వినపడింది. సమూయేలు మళ్ళీ లేచి ఏలీ దగ్గరకు వెళ్ళి, ‘మీరు నన్ను పిలిచారు కదా, నేను వచ్చాను’ అన్నాడు. కానీ ఏలీ, ‘నా కుమారుడా నేను నిన్ను పిలువలేదు. వెళ్ళి పడుకో’ అన్నాడు. కాబట్టి సమూయేలు వెళ్ళి పడుకున్నాడు.
ఆ స్వరము మూడవసారి ‘సమూయేలూ!’ అని పిలవడం వినపడింది. సమూయేలు మళ్ళీ ఏలీ దగ్గరకు పరుగెత్తాడు. ‘ఇదిగో నేను వచ్చాను, మీరు ఈసారి తప్పకుండా నన్ను పిలిచి ఉంటారు’ అన్నాడు. అయితే అలా పిలుస్తుంది యెహోవాయే అని ఏలీకి అప్పుడు అర్థమయ్యింది. కాబట్టి ఆయన సమూయేలుతో, ‘ఈసారి కూడా వెళ్ళి పడుకో. ఆయన మళ్ళీ పిలిస్తే, “యెహోవా మాట్లాడు నీ సేవకుడు వింటున్నాడు” అని చెప్పు’ అన్నాడు.
యెహోవా మళ్ళీ పిలిచినప్పుడు సమూయేలు అలాగే అన్నాడు. అప్పుడు యెహోవా తాను ఏలీని, ఆయన కుమారులను శిక్షించబోతున్నట్లు సమూయేలుకు చెప్పాడు. తర్వాత హొఫ్నీ, ఫీనెహాసు ఫిలిష్తీయుల యుద్ధంలో మరణించారు. జరిగిన సంగతి తెలియగానే ఏలీ క్రిందపడి మెడవిరిగి చనిపోయాడు. యెహోవా మాట నిజమయ్యింది.
సమూయేలు పెద్దవాడై, ఇశ్రాయేలుకు చివరి న్యాయాధిపతి అయ్యాడు. ఆయన వృద్ధుడైనప్పుడు ప్రజలు ఆయన దగ్గరకు వచ్చి, ‘మాకు ఒక రాజును ఏర్పాటు చెయ్యి’ అని అడిగారు. సమూయేలు అలా చేయడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే నిజానికి యెహోవాయే వాళ్ళ రాజు. అయితే యెహోవా ప్రజలమాట వినమని ఆయనకు చెప్పాడు.
1 సమూయేలు 1:1-28; 2:11-36; 4:16-18; 8:4-9.


ప్రశ్నలు

  • చిత్రంలోని అబ్బాయి పేరేమిటి, అతనితోపాటు ఉన్న ఇతరులు ఎవరు?
  • హన్నా ఒకరోజు యెహోవా గుడారానికి వెళ్ళి ఏమని ప్రార్థించింది, యెహోవా ఆమె ప్రార్థనకు ఎలా సమాధానమిచ్చాడు?
  • యెహోవా గుడారంవద్ద సేవచేయడానికి తీసుకోబడినప్పుడు సమూయేలు వయసెంత, ఆయన తల్లి ఆయనకోసం ప్రతి సంవత్సరం ఏమి చేస్తుండేది?
  • ఏలీ కుమారుల పేర్లేమిటి, వాళ్ళు ఎలాంటివాళ్ళు?
  • యెహోవా సమూయేలును ఎలా పిలిచాడు, ఆయన సమూయేలుకు ఏమని చెప్పాడు?
  • సమూయేలు పెద్దవాడయ్యాక ఏమయ్యాడు, ఆయన వృద్ధుడయినప్పుడు ఏమి జరిగింది?

అదనపు ప్రశ్నలు

  • మొదటి సమూయేలు 1:1-28 చదవండి.
    సత్యారాధన విషయంలో ముందుండడంలో కుటుంబ శిరస్సులకు ఎల్కానా ఎలాంటి చక్కని మాదిరిని ఉంచాడు? (1 సమూ. 1:3, 21; మత్త. 6:33; ఫిలి. 1:10)
    కలవరపెట్టే సమస్యతో వ్యవహరించే విషయంలో హన్నా ఉదాహరణ నుండి మనమే పాఠం నేర్చుకోవచ్చు? (1 సమూ. 1:10, 11; కీర్త. 55:22; రోమా. 12:12)
  • మొదటి సమూయేలు 2:11-36 చదవండి.
    ఏలీ తన కుమారులను యెహోవాకంటే గొప్పగా ఎలా ఎంచాడు, అది మనకు ఒక హెచ్చరికగా ఎలా ఉండగలదు? (1 సమూ. 2:22-24, 27, 29; ద్వితీ. 21:18-21; మత్త. 10:36, 37)
  • మొదటి సమూయేలు 4:16-18 చదవండి.
    యుద్ధంనుండి ఏ నాలుగు దుర్వార్తలుగల సమాచారం అందింది, అది ఏలీపై ఎలాంటి ప్రభావం చూపించింది?
  • మొదటి సమూయేలు 8:4-9 చదవండి.
    ఇశ్రాయేలీయులు ఎలా యెహోవా మనస్సును ఎంతగానో నొప్పించారు, మనం నేడు ఎలా ఆయన రాజ్యాన్ని నమ్మకంగా సమర్థించవచ్చు? (1 సమూ. 8:5, 7; యోహా. 17:16; యాకో. 4:4)

గొప్ప బలంగల వ్యక్తి


జీవించినవారిలోకెల్లా గొప్ప బలంగల వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఆయన సమ్సోను అనే పేరుగల న్యాయాధిపతి. సమ్సోనుకు యెహోవాయే అంత బలమిచ్చాడు. సమ్సోను పుట్టక ముందే యెహోవా ఆయన తల్లితో, ‘త్వరలో నీకు ఒక కుమారుడు పుడతాడు. ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయులనుండి కాపాడడంలో అతను నాయకత్వం వహిస్తాడు’ అని చెప్పాడు.



ఫిలిష్తీయులు కనానులో జీవించిన చెడ్డ ప్రజలు. వాళ్ళకు యుద్ధ యోధులు చాలామంది ఉండేవారు. వాళ్ళు ఇశ్రాయేలీయులను ఎంతో బాధపెట్టేవారు. ఒకసారి సమ్సోను ఫిలిష్తీయులు నివసించే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు, దారిలో ఒక పెద్ద సింహం గర్జించుకుంటూ ఆయనపైకి వచ్చింది. అయితే సమ్సోను వట్టి చేతులతోనే ఆ సింహాన్ని చంపేశాడు. ఆయన వందలాదిమంది చెడ్డ ఫిలిష్తీయులను కూడా చంపాడు.
తర్వాత సమ్సోను దెలీలా అనే స్త్రీని ప్రేమించాడు. ఫిలిష్తీయుల నాయకులు, సమ్సోను బలానికి రహస్యమేమిటో కనుక్కొని చెబితే ఒకొక్కరూ 1,100 వెండి నాణెముల చొప్పున ఇస్తామని దెలీలాకు వాగ్దానం చేశారు. దెలీలా ఆ డబ్బంతా కావాలని ఆశపడింది. ఆమె సమ్సోనుకు గాని, దేవుని ప్రజలకు గాని నిజమైన స్నేహితురాలు కాదు. కాబట్టి ఆమె సమ్సోను బలానికి రహస్యమేమిటో చెప్పమని పదే పదే ఆయనను అడిగేది.



చివరకు సమ్సోను తన బలానికి రహస్యమేమిటో దెలీలాకు చెప్పాడు. ‘నా వెంట్రుకలు ఎన్నడూ కత్తిరించబడలేదు, నేను పుట్టినప్పుడే, దేవుడు నన్ను నాజీరు చేయబడినవాడిగా అంటే ఒక ప్రత్యేకమైన సేవకునిగా ఏర్పరచుకున్నాడు. నా వెంట్రుకలను కత్తిరిస్తే నేను నా బలాన్ని కోల్పోతాను’ అని చెప్పాడు.
దెలీలా ఈ సంగతి తెలుసుకోగానే సమ్సోనును తన వడిలో నిద్రపుచ్చి ఆయన వెంట్రుకలను కత్తిరించేందుకు ఒక మనిషిని పిలిపించింది. సమ్సోను నిద్ర లేచేసరికి తన బలాన్ని కోల్పోయాడు. అప్పుడు ఫిలిష్తీయులు వచ్చి ఆయనను బంధించారు. వాళ్ళు ఆయన రెండు కండ్లను పెరికివేసి ఆయనను తమ దాసునిగా చేసుకున్నారు.




ఒకరోజు ఫిలిష్తీయులు తమ దేవుడైన దాగోనును ఆరాధించడానికి గొప్ప విందును ఏర్పాటు చేశారు. అప్పుడు వాళ్ళు సమ్సోనును ఎగతాళి చేయడానికి ఆయనను బందీగృహం నుండి బయటకు తీసుకొచ్చారు. ఈలోగా సమ్సోను వెంట్రుకలు మళ్ళీ పెరిగాయి. సమ్సోను తనను నడిపించుకొని వెళ్తున్న అబ్బాయితో, ‘ఈ భవనపు స్తంభాలను నన్ను పట్టుకోనివ్వు’ అన్నాడు. ఆ తర్వాత సమ్సోను బలం కోసం యెహోవాకు ప్రార్థించి స్తంభాలను పట్టుకున్నాడు. ‘నన్ను ఫిలిష్తీయులతోపాటు చనిపోనివ్వు’ అని ఆయన మొరపెట్టాడు. ఆ విందుకు 3,000 మంది ఫిలిష్తీయులు వచ్చారు. సమ్సోను ఆ స్తంభాలను పట్టుకొని వంగిన వెంటనే ఆ భవనం కూలిపోయి ఆ చెడ్డ ప్రజలందరూ చనిపోయారు.
న్యాయాధిపతులు 13 నుండి 16 అధ్యాయాలు.


ప్రశ్నలు

  • జీవించినవారిలోకెల్లా గొప్ప బలంగల వ్యక్తి పేరేమిటి, ఆయనకు అంత బలాన్ని ఎవరు ఇచ్చారు?
  • చిత్రంలో కనిపిస్తున్నట్లు ఒకసారి సమ్సోను ఒక పెద్ద సింహాన్ని ఏమి చేశాడు?
  • చిత్రంలో సమ్సోను దెలీలాకు ఏ రహస్యం చెబుతున్నాడు, ఆయన ఫిలిష్తీయుల చేత బంధించబడడానికి అది ఎలా కారణమయ్యింది?
  • సమ్సోను చనిపోయిన రోజున శత్రువులైన 3,000 మంది ఫిలిష్తీయులను ఎలా హతమార్చాడు?

అదనపు ప్రశ్నలు

  • న్యాయాధిపతులు 13:1-14 చదవండి.
    మనోహ మరియు ఆయన భార్య, పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులకు ఎలా ఒక మంచి మాదిరిని ఉంచారు? (న్యాయా. 13:8; కీర్త. 127:3; ఎఫె. 6:4)
  • న్యాయాధిపతులు 14:5-9, 15:9-16 చదవండి.
    సమ్సోను సింహాన్ని చంపడం, అతనికి కట్టబడిన కొత్త తాళ్ళను తెంచేయడం, 1,000 మందిని చంపడానికి మగ గాడిద దవడ ఎముకను ఉపయోగించడం వంటి వృత్తాంతాలు యెహోవా పరిశుద్ధాత్మ పని చేయడానికి సంబంధించి ఏమి వెల్లడి చేస్తున్నాయి?
    నేడు పరిశుద్ధాత్మ మనకు ఎలా సహాయం చేస్తుంది? (న్యాయా. 14:6; 15:14; జెక. 4:6; అపొ. 4:31)
  • న్యాయాధిపతులు 16:18-31 చదవండి.
    చెడు సహవాసాలు సమ్సోనుపై ఎలాంటి ప్రభావం చూపించాయి, మనం దానినుండి ఏమి నేర్చుకోవచ్చు? (న్యాయా. 16:18, 19; 1 కొరిం. 15:33)

యెఫ్తా వాగ్దానం








మీరు ఎప్పుడైనా ఒక వాగ్దానం చేసిన తర్వాత దానిని నిలబెట్టుకోవడం కష్టంగా ఉన్నట్లు భావించారా? ఈ చిత్రంలోని వ్యక్తికి అలాగే జరిగింది, అందుకే ఆయన చాలా దుఃఖిస్తున్నాడు. ఆ వ్యక్తి యెఫ్తా అనే పేరుగల ధైర్యవంతుడైన ఇశ్రాయేలు న్యాయాధిపతి.
యెఫ్తా ఇశ్రాయేలీయులు యెహోవాను ఆరాధించడం మానుకున్న కాలంలో జీవించాడు. ఇశ్రాయేలీయులు మళ్ళీ చెడ్డ పనులు చేయడం ప్రారంభించారు. కాబట్టి వాళ్ళను అమ్మోనీయులు బాధపెట్టేందుకు యెహోవా అనుమతించాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు, ‘మేము నీకు వ్యతిరేకముగా పాపము చేశాం. దయచేసి మమ్మల్ని రక్షించు!’ అని యెహోవాకు మొరపెట్టుకున్నారు.


ప్రజలు తాము చేసిన చెడ్డ పనుల విషయంలో బాధపడ్డారు. వాళ్ళు మళ్ళీ యెహోవాను ఆరాధించడం ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. కాబట్టి మళ్ళీ యెహోవా వాళ్ళకు సహాయం చేశాడు.
చెడ్డ ప్రజలైన అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి ఇశ్రాయేలీయులు యెఫ్తాను ఎన్నుకున్నారు. యుద్ధంలో యెహోవా తనకు సహాయం చేయాలని యెఫ్తా ఎంతగానో కోరుకున్నాడు. కాబట్టి ఆయన యెహోవాకు ఇలా వాగ్దానం చేశాడు: ‘అమ్మోనీయులపై నువ్వు నాకు విజయం చేకూరిస్తే, విజయోత్సాహంతో నేను తిరిగి వెళ్ళినప్పుడు నన్ను కలవడానికి నా ఇంట్లోనుండి వచ్చే మొదటి వ్యక్తిని నేను నీకు అర్పిస్తాను.’
యెహోవా యెఫ్తా వాగ్దానాన్ని అంగీకరించి ఆయన విజయం పొందేలా సహాయం చేశాడు. యెఫ్తా ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనను కలవడానికి బయటికి వచ్చిన మొదట వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఆయన ఒక్కగానొక్క కుమార్తే వచ్చింది. ‘నా కుమారీ! నాకు ఎంత దుఃఖాన్ని కలుగజేస్తున్నావు. నేను యెహోవాకు వాగ్దానం చేశాను, దానిని నేను వెనుకకు తీసుకోలేను’ అని యెఫ్తా విలపించాడు.
యెఫ్తా కుమార్తె ఆ వాగ్దానం గురించి విన్నప్పుడు మొదట ఆమె కూడా దుఃఖించింది. ఎందుకంటే ఆమె తన తండ్రిని, స్నేహితులను విడిచి వెళ్ళాలి. ఆమె తన మిగతా జీవితాన్నంతా షిలోహులో యెహోవా మందిరంలో ఆయనకు సేవచేస్తూ గడపాలి. కాబట్టి ఆమె తన తండ్రితో ‘నువ్వు యెహోవాకు వాగ్దానం చేస్తే దాన్ని నిలబెట్టుకోవాలి’ అన్నది.
ఆ విధంగా యెఫ్తా కుమార్తె షిలోహుకు వెళ్ళి తన మిగతా జీవితాన్నంతా యెహోవాను సేవిస్తూ ఆయన మందిరంలోనే గడిపింది. ఇశ్రాయేలు స్త్రీలు సంవత్సరంలో నాలుగు రోజులు ఆమెను దర్శించడానికి వెళ్ళి, ఆమెతో సంతోషంగా సమయం గడిపేవారు. యెఫ్తా కుమార్తె యెహోవాకు చాలా మంచి సేవకురాలు కాబట్టి ప్రజలు ఆమెను ఎంతగానో ప్రేమించారు.
న్యాయాధిపతులు 10:6-18; 11:1-40.


ప్రశ్నలు

  • యెఫ్తా ఎవరు, ఆయన ఏ కాలంలో జీవించాడు?
  • యెఫ్తా యెహోవాకు ఏమని వాగ్దానం చేశాడు?
  • అమ్మోనీయులపై విజయం సాధించిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చినప్పుడు యెఫ్తా ఎందుకు బాధపడ్డాడు?
  • తన తండ్రి వాగ్దానం గురించి తెలుసుకున్నప్పుడు యెఫ్తా కుమార్తె ఏమి అన్నది?
  • ప్రజలు యెఫ్తా కుమార్తెను ఎందుకు ఇష్టపడ్డారు?

అదనపు ప్రశ్నలు

  • న్యాయాధిపతులు 10:6-18 చదవండి.
    ఇశ్రాయేలీయులు యెహోవాపట్ల విశ్వాసం లేకుండా ప్రవర్తించిన విధానం నుండి మనమే హెచ్చరికను లక్ష్యపెట్టాలి? (న్యాయా. 10:6, 15, 16; రోమా. 15:4; ప్రక. 2:10)
  • న్యాయాధిపతులు 11:1-11, 29-40 చదవండి.
    యెఫ్తా తన కుమార్తెను “దహనబలిగా” ఇవ్వడం అంటే దానర్థం ఆమెను మానవ బలిగా అగ్ని ద్వారా అర్పించడం కాదని మనకు ఎలా తెలుసు? (న్యాయా. 11:31; లేవీ. 16:24; ద్వితీ. 18:10, 12)
    యెఫ్తా తన కుమార్తెను ఏ విధంగా ఒక బలిగా అర్పించాడు?
    యెఫ్తా తాను యెహోవాకు చేసిన వాగ్దానంపట్ల ప్రదర్శించిన వైఖరి నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (న్యాయా. 11:35, 39; ప్రసం. 5:4, 5; మత్త. 16:24)
    యౌవన క్రైస్తవులు పూర్తికాల సేవను తమ వృత్తిగా చేసుకోవడానికి యెఫ్తా కుమార్తె ఎలా ఒక మంచి మాదిరిగా ఉంది? (న్యాయా. 11:36; మత్త. 6:33; ఫిలి. 3:8)

గిద్యోను, అతని 300 మంది పురుషులు



ఇక్కడ ఏమి జరుగుతుందో చూస్తున్నారా? వాళ్ళంతా ఇశ్రాయేలు యుద్ధ యోధులు. క్రిందకు వంగిన పురుషులు నీళ్ళు త్రాగుతున్నారు. వాళ్ళ దగ్గర నిలబడివున్న వ్యక్తి న్యాయాధిపతియైన గిద్యోను. ఆయన వాళ్ళు నీళ్ళు ఎలా త్రాగుతున్నారో గమనిస్తున్నాడు.
ఆ పురుషులు వేర్వేరు పద్ధతుల్లో నీళ్ళు ఎలా త్రాగుతున్నారో గమనించండి. కొంతమంది తమ ముఖాలను నీళ్ళవరకు పెట్టారు. కానీ ఒక వ్యక్తి మాత్రం తన చుట్టూ జరిగేవాటిని గమనించడానికి వీలుగా నీళ్ళను చేతిలోకి తీసుకొని త్రాగుతున్నాడు. అలా చేయడం ప్రాముఖ్యం, ఎందుకంటే నీళ్ళు త్రాగేటప్పుడు తమ చుట్టూ జరుగుతున్నవాటిని గమనించే పురుషులను మాత్రమే ఎన్నుకోమని యెహోవా గిద్యోనుకు చెప్పాడు. మిగతావాళ్ళను ఇంటికి పంపించమని దేవుడు చెప్పాడు. ఎందుకో చూద్దాం.
ఇశ్రాయేలీయులు మళ్ళీ చాలా కష్టాల్లో చిక్కుకున్నారు. దానికి కారణం వాళ్ళు యెహోవాకు విధేయత చూపించకపోవడమే. మిద్యానీయులు వాళ్ళపై ఆధిపత్యం సంపాదించుకొని వాళ్ళను బాధించడం ప్రారంభించారు. కాబట్టి తమకు సహాయం చేయమని ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టుకున్నారు, యెహోవా వాళ్ళ మొర విన్నాడు.
యెహోవా గిద్యోనుతో సైన్యాన్ని సమకూర్చమని చెప్పినప్పుడు గిద్యోను 32,000 మంది యోధులను సమకూర్చాడు. అయితే ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ఉన్న సైన్యంలో 1,35,000 మంది పురుషులు ఉన్నారు. అయినా యెహోవా గిద్యోనుతో ‘నీకు చాలామంది పురుషులున్నారు’ అని అన్నాడు. యెహోవా అలా ఎందుకు అన్నాడు?
ఎందుకంటే ఒకవేళ ఇశ్రాయేలీయులు యుద్ధాన్ని జయిస్తే, వాళ్ళు తమకై తామే జయించామని అనుకోవచ్చు. యుద్ధంలో జయించడానికి తమకు యెహోవా సహాయం అవసరం లేదని వాళ్ళు అనుకోవచ్చు. అందుకే యెహోవా గిద్యోనుతో, ‘యుద్ధం చేయడానికి భయపడే వాళ్ళందరినీ ఇళ్ళకు వెళ్ళమని చెప్పు’ అన్నాడు. గిద్యోను అలా చెప్పినప్పుడు, 22,000 మంది వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన దగ్గర 1,35,000 మందితో పోరాడడానికి కేవలం 10,000 మంది మాత్రమే మిగిలారు.

పురుషులను పరీక్షిస్తున్న గిద్యోను
అయితే, వినండి! యెహోవా మళ్ళీ గిద్యోనుతో ‘నీ దగ్గర ఇంకా ఎక్కువమందే ఉన్నారు’ అన్నాడు. కాబట్టి వాళ్ళందరిని నీళ్ళు త్రాగడానికి వాగు దగ్గరకు తీసుకెళ్ళి, నీళ్ళవరకూ ముఖం పెట్టి త్రాగేవారిని ఇంటికి పంపించమని యెహోవా గిద్యోనుకు చెప్పాడు. ‘నీళ్ళు త్రాగుతున్నప్పుడు తమ చుట్టూ జరుగుతున్నవాటిని గమనించే 300 మంది పురుషులతోనే నేను నీకు విజయాన్ని కలుగజేస్తాను’ అని యెహోవా వాగ్దానం చేశాడు.
యుద్ధం చేసే సమయం వచ్చింది. గిద్యోను తన 300 మంది పురుషులను మూడు గుంపులుగా ఏర్పాటు చేశాడు. ఆయన వాళ్ళలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బూరను, లోపల దివిటీగల ఒక కుండను ఇచ్చాడు. దాదాపు మధ్యరాత్రి అయినప్పుడు వాళ్ళంతా శత్రు సైన్య శిబిరాన్ని చుట్టుముట్టారు. తర్వాత వాళ్ళంతా ఒకేసారి బూరలను ఊది, కుండలను పగులగొట్టి ‘యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము!’ అని కేకలు వేశారు. శత్రు సైనికులు లేచినప్పుడు వాళ్ళు కలవరపడి భయపడ్డారు. వాళ్ళంతా పరుగెత్తడం ప్రారంభించారు. ఇశ్రాయేలీయులు యుద్ధాన్ని జయించారు.
న్యాయాధిపతులు 6 నుండి 8 అధ్యాయాలు.


ప్రశ్నలు

  • ఇశ్రాయేలీయులు ఎలా, ఎందుకు చాలా కష్టాల్లో చిక్కుకున్నారు?
  • గిద్యోను సైన్యంలో చాలామంది ఉన్నారు అని యెహోవా ఎందుకు అన్నాడు?
  • గిద్యోను భయపడేవాళ్ళని ఇంటికి వెళ్ళమని చెప్పిన తర్వాత ఎంతమంది పురుషులు మిగిలారు?
  • చిత్రం సహాయంతో, యెహోవా గిద్యోను సైన్యాన్ని కేవలం 300 మందికి తగ్గించిన విధానాన్ని వివరించండి.
  • గిద్యోను తన 300 మంది పురుషులను ఎలా ఏర్పాటు చేశాడు, ఇశ్రాయేలు యుద్ధంలో ఎలా విజయం సాధించింది?

అదనపు ప్రశ్నలు

  • న్యాయాధిపతులు 6:36-40 చదవండి.
    యెహోవా చిత్తమేమిటో గిద్యోను ఎలా నిశ్చయపరచుకున్నాడు?
    నేడు మనం యెహోవా చిత్తమేమిటో ఎలా తెలుసుకోవచ్చు? (సామె. 2:3-6; మత్త. 7:7-11; 2 తిమో. 3:16, 17)
  • న్యాయాధిపతులు 7:1-25 చదవండి.
    నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి విరుద్ధంగా అప్రమత్తంగా ఉండిన 300 మంది నుండి మనమే పాఠం నేర్చుకోవచ్చు? (న్యాయా. 7:3, 6; రోమా. 13:11, 12; ఎఫె. 5:15-17)
    ఆ 300 మంది పురుషులు గిద్యోనును చూసి నేర్చుకున్నట్లే మనం గొప్ప గిద్యోను అయిన యేసుక్రీస్తును చూసి ఎలా నేర్చుకుంటాము? (న్యాయా. 7:17; మత్త. 11:29, 30; 28:19, 20; 1 పేతు. 2:21)
    యెహోవా సంస్థలో ఎక్కడ సేవ చేయడానికి నియమించబడినా మనం సంతృప్తిగా ఉండడానికి న్యాయాధిపతులు 7:21 ఎలా సహాయం చేస్తుంది? (1 కొరిం. 4:2; 12:14-18; యాకో. 4:10)
  • న్యాయాధిపతులు 8:1-3 చదవండి.
    ఒక సహోదరునితో లేదా సహోదరితో ఉన్న వ్యక్తిగత మనస్పర్థలను పరిష్కరించుకునే విషయానికి వచ్చినప్పుడు, గిద్యోను ఎఫ్రాయిమీయులతో ఉన్న కలహాన్ని పరిష్కరించిన విధానం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (సామె. 15:1; మత్త. 5:23, 24; లూకా 9:48)

రూతు, నయోమి


బైబిలులో రూతు అనే పుస్తకం ఉంది. అది ఇశ్రాయేలుకు న్యాయాధిపతులు ఉన్నకాలంలో జీవించిన ఒక కుటుంబం గురించిన కథ. రూతు మోయాబు దేశానికి చెందిన యౌవన స్త్రీ; ఆమె దేవుని జనాంగమైన ఇశ్రాయేలుకు సంబంధించినది కాదు. కానీ రూతు సత్య దేవుడైన యెహోవా గురించి తెలుసుకున్నప్పుడు ఆయనను ఎంతగానో ప్రేమించింది. నయోమి ఒక వృద్ధ స్త్రీ, ఆమె రూతుకు యెహోవా గురించి తెలుసుకోవడానికి సహాయం చేసింది.
నయోమి ఇశ్రాయేలు స్త్రీ. ఇశ్రాయేలులో ఆహార కొరత వచ్చినప్పుడు ఆమె, ఆమె భర్త, ఇద్దరు కుమారులు మోయాబు దేశానికి తరలి వెళ్ళారు. కొద్దికాలం తర్వాత నయోమి భర్త చనిపోయాడు. తర్వాత నయోమి ఇద్దరు కుమారులు మోయాబు దేశానికి చెందిన రూతు, ఓర్పా అనే ఇద్దరు అమ్మాయిలను పెళ్ళి చేసుకున్నారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత నయోమి ఇద్దరు కుమారులూ చనిపోయారు. నయోమికి, ఆ ఇద్దరు అమ్మాయిలకు ఎంత దుఃఖం కలిగిందో! ఆ తర్వాత నయోమి ఏమి చేసింది?
ఒకరోజు నయోమి మళ్ళీ తన స్వంత ప్రజల దగ్గరకు, తన స్వదేశానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. రూతు, ఓర్పా ఆమెతోపాటే ఉండాలనుకొని ఆమెతో బయలుదేరారు. అయితే వాళ్ళు కొంత దూరం ప్రయాణించిన తర్వాత, నయోమి ఆ అమ్మాయిలవైపు తిరిగి, ‘మీరు మీ ఇళ్ళకు వెళ్ళి మీ తల్లుల దగ్గర ఉండండి’అని చెప్పింది.
నయోమి ఆ అమ్మాయిలను ముద్దు పెట్టుకొని వాళ్ళకు వీడ్కోలు చెప్పింది. అప్పుడు వాళ్ళిద్దరూ ఏడ్వడం ప్రారంభించారు, ఎందుకంటే వాళ్ళు నయోమిని ఎంతో ప్రేమించారు. ‘మేము వెళ్ళము! మేము నీతోపాటు నీ ప్రజల దగ్గరకు వస్తాము’ అని వాళ్ళు అన్నారు. కానీ నయోమి వాళ్ళతో ‘నా కుమార్తెలారా, మీరు తిరిగి వెళ్ళండి. మీరు మీ ఇళ్ళలో ఉండడమే మంచిది’అని సమాధానమిచ్చింది. కాబట్టి ఓర్పా తన స్వదేశానికి బయలుదేరి వెళ్ళింది. కానీ రూతు వెళ్ళలేదు.
అప్పుడు నయోమి ఆమెవైపు తిరిగి, ‘ఓర్పా వెళ్ళింది. నువ్వు కూడా ఆమెతోపాటు ఇంటికి వెళ్ళు’అంది. అందుకు రూతు, ‘నేను నిన్ను విడిచి వెళ్ళేలా చేయడానికి ప్రయత్నించవద్దు! నన్ను నీతోనే రానివ్వు. నువ్వు ఎక్కడికి వెళ్తావో నేనూ అక్కడికే వస్తాను. నువ్వు ఎక్కడ ఉంటావో నేనూ అక్కడే ఉంటాను. నీ ప్రజలే నా ప్రజలు. నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ మరణిస్తావో నేనూ అక్కడే మరణిస్తాను. నేను నీ దగ్గరే పాతిపెట్టబడతాను’అంది. రూతు అలా అన్నప్పుడు నయోమి ఇంక ఆమెను ఇంటికి పంపించడానికి ప్రయత్నించలేదు.
చివరకు ఆ ఇద్దరు స్త్రీలు ఇశ్రాయేలుకు చేరుకొని అక్కడ నివసించడం ప్రారంభించారు. అది యవలు సమకూర్చే కాలము కాబట్టి రూతు వెంటనే పొలాల్లో పని చేయడం మొదలుపెట్టింది. బోయజు అనే వ్యక్తి ఆమెను తన పొలంలో పరిగె ఏరుకొనేందుకు అనుమతించాడు. బోయజు తల్లి ఎవరో మీకు తెలుసా? ఆమె యెరికో పట్టణానికి చెందిన రాహాబు.
ఒకరోజు బోయజు రూతుతో, ‘నేను నీ గురించి అంతా విన్నాను. నువ్వు నయోమిపట్ల ఎంత దయగా ఉన్నావో విన్నాను. నువ్వు నీ తండ్రిని, తల్లిని, నీ స్వదేశాన్ని విడిచిపెట్టి నీకు తెలియని ప్రజలతో జీవించడానికి వచ్చావని కూడా నాకు తెలుసు. యెహోవా నీకు మేలు కలుగజేయును గాక!’ అన్నాడు.
దానికి రూతు, ‘నా యజమానుడా, మీరు నాపట్ల ఎంతో దయగా ప్రవర్తించారు. మీరు నాతో మంచిగా మాట్లాడి నాకు ఎంతో సంతోషం కలిగించారు’అని అంది. బోయజు రూతును ఎంతో ఇష్టపడ్డాడు. కొద్దికాలం తర్వాత వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. అది నయోమికి ఎంత సంతోషాన్ని కలిగించివుంటుందో కదా! రూతు బోయజులకు మొదటి కుమారుడు ఓబేదు పుట్టినప్పుడు నయోమి ఇంకా సంతోషించింది. తర్వాత ఓబేదు దావీదుకు తాతయ్య అయ్యాడు. దావీదు గురించి మనం తర్వాత చాలా తెలుసుకుంటాం.

రూతు, నయోమి
బైబిలు పుస్తకమైన రూతు.


ప్రశ్నలు

  • నయోమి మోయాబు దేశానికి ఎందుకు వచ్చింది?
  • రూతు, ఓర్పా ఎవరు?
  • తమ ప్రజల దగ్గరకు తిరిగి వెళ్ళమని నయోమి చెప్పినప్పుడు రూతు ఎలా ప్రతిస్పందించింది, ఓర్పా ఎలా ప్రతిస్పందించింది?
  • బోయజు ఎవరు, ఆయన రూతుకు, నయోమికి ఎలా సహాయం చేశాడు?
  • బోయజు రూతులకు పుట్టిన అబ్బాయి పేరేమిటి, ఆయనను మనం ఎందుకు గుర్తుంచుకోవాలి?

అదనపు ప్రశ్నలు

  • రూతు 1:1-17 చదవండి.
    రూతు విశ్వసనీయమైన ప్రేమను ఎలా అద్భుతమైన విధంగా కనపరిచింది? (రూతు 1:16, 17)
    రూతు మానసిక వైఖరి, నేడు భూమిపైవున్న అభిషిక్తులపట్ల “వేరే గొఱ్ఱెల”కు ఉన్న వైఖరిని ఎలా వ్యక్తం చేస్తోంది? (యోహా. 10:16; జెక. 8:23)
  • రూతు 2:1-23 చదవండి.
    నేటి యువతుల కోసం రూతు ఒక చక్కని మాదిరిని ఎలా ఉంచింది? (రూతు 2:17, 18; సామె. 23:22; 31:15)
  • రూతు 3:5-13 చదవండి.
    రూతు ఒక యువకుడిని కాకుండా తనను పెళ్ళి చేసుకోవడానికి సుముఖత చూపించడాన్ని బోయజు ఎలా దృష్టించాడు?
    రూతు వైఖరి మనకు విశ్వసనీయ ప్రేమ గురించి ఏమి బోధిస్తోంది? (రూతు 3:10; 1 కొరిం. 13:4, 5)
  • రూతు 4:7-17 చదవండి.
    నేడు క్రైస్తవ పురుషులు బోయజులా ఎలా ఉండవచ్చు? (రూతు 4:9, 10; 1 తిమో. 3:1, 12, 13; 5:8)

ధైర్యంగల ఇద్దరు స్త్రీలు


ఇశ్రాయేలీయులు కష్టాల్లో చిక్కుకున్నప్పుడు యెహోవాకు మొరపెట్టుకున్నారు. వాళ్ళకు సహాయం చేయడానికి ధైర్యంగల నాయకులను ఏర్పాటు చేయడం ద్వారా యెహోవా వాళ్ళ ప్రార్థనలకు సమాధానమిచ్చాడు. ఆ నాయకులను బైబిలు న్యాయాధిపతులు అని పిలుస్తుంది. మొదటి న్యాయాధిపతి యెహోషువ. ఆయన తరువాత వచ్చిన న్యాయాధిపతులలో కొంతమంది పేర్లు ఒత్నీయేలు, ఏహూదు, షమ్గరు. అయితే ఇశ్రాయేలుకు సహాయం చేసినవారిలో దెబోరా, యాయేలు అనే ఇద్దరు స్త్రీలు కూడా ఉన్నారు.

బారాకుతో మాట్లాడుతున్న దెబోరా
దెబోరా ఒక ప్రవక్త్రిని. యెహోవా ఆమెకు భవిష్యత్తును గురించిన విషయాలు తెలియజేసేవాడు, యెహోవా చెప్పిన దానిని ఆమె ప్రజలకు తెలియజేసేది. దెబోరా ఒక న్యాయాధిపతి కూడా. ఆమె కొండప్రాంతంలో ఒక ఈత చెట్టు క్రింద కూర్చొని ఉండేది. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి సహాయం కోసం ఆమె దగ్గరకు వచ్చేవారు.
ఆ సమయంలో కనానును యాబీను రాజు పరిపాలించేవాడు. అతనికి 900 యుద్ధ రథాలు ఉండేవి. యాబీను సైన్యం ఎంతో బలమైనది కాబట్టి అతను చాలామంది ఇశ్రాయేలీయులను బలవంతంగా దాసులుగా చేసుకున్నాడు. యాబీను రాజు సైన్యాధిపతి పేరు సీసెరా.
ఒకరోజు దెబోరా న్యాయాధిపతియైన బారాకును పిలిపించి, ‘ “నువ్వు 10,000 మందిని తీసుకొని తాబోరు కొండ దగ్గరకు వెళ్ళు. నేను అక్కడ నీ దగ్గరకు సీసెరాను రప్పిస్తాను. అతనిపై అతని సైన్యంపై నేను నీకు విజయం కలుగజేస్తాను” అని యెహోవా చెప్పాడు’ అని తెలియజేసింది.
బారాకు దెబోరాతో, ‘నువ్వు కూడా నాతో వస్తే నేను వెళ్తాను’ అన్నాడు. దెబోరా బారాకుతో వెళ్ళింది. అయితే ఆమె బారాకుతో, ‘ఈ విజయానికి నువ్వు ఘనత పొందవు, ఎందుకంటే యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగిస్తాడు’ అని చెప్పింది. చివరకు అలాగే జరిగింది.
బారాకు తాబోరు కొండపైనుండి దిగి సీసెరా సైన్యాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. యెహోవా అకస్మాత్తుగా వరద రప్పించినప్పుడు శత్రు సైన్యంలోని అనేకులు మునిగిపోయారు. అప్పుడు సీసెరా రథం దిగి పరుగెత్తి పారిపోయాడు.

బారాకు, యాయేలు, సీసెరా
కొంతసేపటి తరువాత సీసెరా యాయేలు గుడారం దగ్గరకు వెళ్ళాడు. ఆమె అతనిని లోపలికి ఆహ్వానించి త్రాగడానికి కొంచెం పాలిచ్చింది. అది అతనికి నిద్రమత్తు కలిగేలా చేసింది కాబట్టి అతను వెంటనే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు యాయేలు గుడారపు మేకును తీసుకొని ఆ చెడ్డ వ్యక్తి కణతలో దిగగొట్టింది. తర్వాత బారాకు రాగానే ఆమె చనిపోయిన సీసెరాను ఆయనకు చూపించింది! చూశారా, దెబోరా చెప్పినట్లే జరిగింది.
చివరకు యాబీను రాజు కూడా చంపబడ్డాడు. కొంతకాలంవరకూ ఇశ్రాయేలీయులు మళ్ళీ సమాధానంతో జీవించారు.
న్యాయాధిపతులు 2:14-22; 4:1-24; 5:1-31.


ప్రశ్నలు

  • న్యాయాధిపతులు ఎవరు, వాళ్ళలో కొంతమంది పేర్లేమిటి?
  • దెబోరాకు ఎలాంటి ప్రత్యేకమైన ఆధిక్యత ఉండేది, దానికి సంబంధించి ఆమె ఏమేమి చేస్తుండేది?
  • యాబీను రాజు మరియు ఆయన సైన్యాధిపతి సీసెరా ఇశ్రాయేలుకు ప్రమాదంగా తయారైనప్పుడు, దెబోరా న్యాయాధిపతియైన బారాకుకు యెహోవానుండి వచ్చిన ఏ సందేశాన్ని తెలియజేసింది, దాని కోసం ఎవరు ఘనతను పొందుతారని ఆమె చెప్పింది?
  • తాను ధైర్యంగల స్త్రీనని యాయేలు ఎలా చూపించింది?
  • యాబీను రాజు చనిపోయిన తర్వాత ఏమి జరిగింది?

అదనపు ప్రశ్నలు

  • న్యాయాధిపతులు 2:14-22 చదవండి.
    ఇశ్రాయేలీయులు తమపైకి యెహోవా కోపాన్ని ఎలా తెచ్చుకున్నారు, మనం దానినుండి ఏ పాఠం నేర్చుకోవచ్చు? (న్యాయా. 2:20; సామె. 3:1, 2; యెహె. 18:21-23)
  • న్యాయాధిపతులు 4:1-24 చదవండి.
    దెబోరా యాయేలుల ఉదాహరణల నుండి నేటి క్రైస్తవ స్త్రీలు విశ్వాసానికి, ధైర్యానికి సంబంధించిన ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు? (న్యాయా. 4:4, 8, 9, 14, 21, 22; సామె. 31:30; 1 కొరిం. 16:13)
  • న్యాయాధిపతులు 5:1-31 చదవండి.
    బారాకు దెబోరాలు పాడిన విజయ గీతాన్ని రానున్న అర్మగిద్దోను యుద్ధం గురించిన ప్రార్థనగా ఎలా అన్వయించవచ్చు? (న్యాయా. 5:3, 31; 1 దిన. 16:8-10; ప్రక. 7:9, 10; 16:16; 19:19-21)

సూర్యుడు అలాగే నిలిచిపోవడం


యెహోషువ వైపు చూడండి. ఆయన, ‘సూర్యుడా, నిలిచిపో!’ అని అంటున్నాడు. అప్పుడు సూర్యుడు అలాగే నిలిచిపోయాడు. రోజంతా ఆకాశం మధ్యలో అలాగే నిలిచిపోయాడు. యెహోవాయే అలా జరిగేలా చేశాడు! అయితే సూర్యుడు ప్రకాశిస్తూనే ఉండాలని యెహోషువ ఎందుకు కోరుకున్నాడో చూద్దాం.

సూర్యుడు
కనాను దేశంలోని ఐదుగురు చెడ్డ రాజులు గిబియోనీయులతో యుద్ధం చేయడం ప్రారంభించినప్పుడు గిబియోనీయులు సహాయం కోరడానికి యెహోషువ దగ్గరకు ఒక వ్యక్తిని పంపించారు. ‘త్వరగా మా దగ్గరకు రండి! మమ్మల్ని రక్షించండి! కొండప్రాంతంలోని రాజులంతా మీ సేవకులమైన మాతో యుద్ధం చేయడానికి వచ్చారు’ అని ఆ వ్యక్తి చెప్పాడు.
వెంటనే యెహోషువ, ఆయన యుద్ధశూరులందరూ వెళ్ళారు. వాళ్ళు రాత్రంతా నడిచి వెళ్ళారు. వాళ్ళు గిబియోనుకు రాగానే ఆ ఐదుగురు రాజుల సైనికులు భయపడి పారిపోవడం ప్రారంభించారు. అప్పుడు యెహోవా ఆకాశం నుండి వడగండ్ల వర్షము కురిసేలా చేశాడు, యెహోషువ యుద్ధశూరుల చేతిలోకంటె వడగండ్ల చేతనే ఎక్కువమంది మరణించారు.

యెహోషువ
అయితే కొంతసేపటికి సూర్యుడు అస్తమిస్తాడని యెహోషువ గ్రహించాడు. చీకటిపడినప్పుడు ఐదుగురు చెడ్డ రాజుల సైనికుల్లో చాలామంది తప్పించుకుపోయే అవకాశం ఉంది. అందుకే యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసి, ‘సూర్యుడా నిలిచిపో!’ అని అన్నాడు. సూర్యుడు అలాగే ప్రకాశిస్తుండగా ఇశ్రాయేలీయులు యుద్ధంలో విజయం సాధించగలిగారు.
దేవుని ప్రజలను ద్వేషించే అనేకమంది చెడ్డరాజులు కనానులో ఉండేవారు. ఆ దేశానికి చెందిన 31 మంది రాజులను జయించడానికి యెహోషువకు, ఆయన సైన్యానికి దాదాపు ఆరు సంవత్సరాలు పట్టింది. ఆ పని పూర్తైన తర్వాత, యెహోషువ ఇంకా స్థలం కావలసిన ఇశ్రాయేలు గోత్రాలకు కనాను దేశము పంచిపెట్టబడేలా చూశాడు.
అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత చివరకు 110 సంవత్సరాల వయస్సులో యెహోషువ మరణించాడు. ఆయన, ఆయన స్నేహితులు బ్రతికివున్నంతకాలం ప్రజలు యెహోవాకు విధేయత చూపించారు. కానీ ఆ మంచి మనుష్యులు చనిపోయిన తరువాత ప్రజలు చెడ్డ పనులు చేయడం ప్రారంభించి కష్టాల్లో చిక్కుకున్నారు. ఆ సమయంలోనే వాళ్ళకు నిజంగా దేవుని సహాయం అవసరమయ్యింది.
యెహోషువ 10:6-15; 12:7-24; 14:1-5; న్యాయాధిపతులు 2:8-13.


ప్రశ్నలు

  • చిత్రంలో యెహోషువ ఏమంటున్నాడు, ఎందుకు అలా అంటున్నాడు?
  • యెహోవా యెహోషువకు, ఆయన యుద్ధశూరులకు ఎలా సహాయం చేశాడు?
  • యెహోషువ ఎంతమంది శత్రు రాజులను ఓడించాడు, దానికి ఎంత సమయం పట్టింది?
  • యెహోషువ కనాను దేశాన్ని ఎందుకు పంచాడు?
  • యెహోషువ చనిపోయేటప్పటికి ఆయన వయసెంత, ఆ తర్వాత ఇశ్రాయేలీయులకు ఏమి జరిగింది?

అదనపు ప్రశ్నలు

  • యెహోషువ 10:6-15 చదవండి.
    ఇశ్రాయేలు కోసం యెహోవా సూర్యుడు, చంద్రుడు నిలిచిపోయేలా చేశాడని తెలుసుకోవడంవల్ల నేడు మనమే నమ్మకంతో ఉండవచ్చు? (యెహో. 10:8, 10, 12, 13; కీర్త. 18:3; సామె. 18:10)
  • యెహోషువ 12:7-24 చదవండి.
    కనానులో 31 మంది రాజులు ఓడించబడడానికి కారణమెవరు, అది మనకు నేడు ఎందుకు ప్రాముఖ్యం? (యెహో. 12:7; 24:11-13; ద్వితీ. 31:8; లూకా 21:9, 25-28)
  • యెహోషువ 14:1-5 చదవండి.
    దేశము ఇశ్రాయేలు గోత్రాల మధ్య ఎలా పంచిపెట్టబడింది, పరదైసులో స్వాస్థ్యంగా లభించే స్థలం గురించి అది ఏమి సూచిస్తోంది? (యెహో. 14:2; యెష. 65:21; యెహె. 47:21-23; 1 కొరిం. 14:33)
  • న్యాయాధిపతులు 2:8-13 చదవండి.
    ఇశ్రాయేలులో యెహోషువలాగే నేడు మతభ్రష్టత్వాన్ని ఎవరు అదుపు చేస్తున్నారు? (న్యాయా. 2:8, 10, 11; మత్త. 24:45-47; 2 థెస్స. 2:3-6; తీతు 1:7-9; ప్రక. 1:1; 2:1, 2)

తెలివైన గిబియోనీయులు

కనానులోని చాలా పట్టణాలు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాయి. వాళ్ళు తాము జయించగలము అనుకున్నారు. కానీ దగ్గర్లోని గిబియోను పట్టణస్థులు అలా అనుకోలేదు. దేవుడు ఇశ్రాయేలీయులకు సహాయం చేస్తున్నాడని వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు. కాబట్టి గిబియోనీయులు ఏమి చేశారో తెలుసా?
వాళ్ళు ఎక్కడో దూరప్రాంతంలో నివసించేవారిలా కనిపించాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళలో కొంతమంది చాలా పాతబడిన బట్టలను, అరిగిపోయిన చెప్పులను వేసుకున్నారు. ఎంతో పాతబడిన బస్తాలను తమ గాడిదలపై వేసుకొని, తమతోపాటు కొన్ని ఎండిపోయిన సద్ది రొట్టెలను తీసుకొని వెళ్ళారు. వాళ్ళు యెహోషువ దగ్గరకు వెళ్ళి, ‘మేము మీ గొప్ప దేవుడైన యెహోవా గురించి విని ఎంతో దూరంనుండి వచ్చాము. ఆయన మీకు ఐగుప్తులో చేసిన వాటన్నింటి గురించి మేము విన్నాము. అందుచేత మా పెద్దలు ప్రయాణానికి కొంత ఆహారమును సిద్ధం చేసుకొని వెళ్ళి, “మేము మీ దాసులం. మాతో యుద్ధము చేయమని మాకు ప్రమాణం చేయండి” అని మీకు చెప్పమన్నారు. దూరప్రయాణం మూలంగా మా బట్టలు చినిగిపోయాయని, మా రొట్టెలు సద్దివై ఎండిపోయాయని మీరు చూడవచ్చు’ అని చెప్పారు.
యెహోషువ, ఇతర నాయకులు గిబియోనీయుల మాటలను నమ్మారు. కాబట్టి వాళ్ళతో యుద్ధం చేయము అని వాళ్ళకు ప్రమాణం చేశారు. కానీ మూడు రోజుల తర్వాత గిబియోనీయులు నిజానికి ఆ దగ్గర్లోనే నివసిస్తున్నారని వాళ్ళకు తెలిసింది.
‘మీరు దూరప్రాంతంనుండి వచ్చామని ఎందుకు చెప్పారు?’ అని యెహోషువ వాళ్ళను అడిగాడు.
అందుకు గిబియోనీయులు, ‘మీ దేవుడైన యెహోవా ఈ కనాను దేశమంతటిని మీకు ఇస్తానని వాగ్దానం చేశాడని మేము విన్నాము. కాబట్టి మీరు మమ్మల్ని చంపేస్తారని మేము భయపడ్డాము. అందుకే మేము అలా చెప్పాము’ అని సమాధానమిచ్చారు. అయితే ఇశ్రాయేలీయులు తమ ప్రమాణాన్ని నిలుపుకొని గిబియోనీయులను చంపలేదు. దానికి బదులు వాళ్ళు గిబియోనీయులను తమ సేవకులుగా చేసుకున్నారు.
గిబియోనీయులు ఇశ్రాయేలీయులతో సమాధానపడినందుకు యెరూషలేము రాజుకు చాలా కోపం వచ్చింది. కాబట్టి ఆయన వేరే నలుగురు రాజులను, ‘గిబియోనుతో యుద్ధం చేసేందుకు నాకు సహాయం చేయండి’ అని అడిగాడు. ఆ ఐదుగురు రాజులు కలిసి అలానే యుద్ధం చేశారు. ఇశ్రాయేలీయులతో సమాధానపడినందుకే ఆ రాజులు యుద్ధం చేయడానికి వచ్చారు కదా, మరి గిబియోనీయులు ఇశ్రాయేలుతో సమాధానపడి జ్ఞానయుక్తమైన పనే చేశారా? మనం దాని గురించి చూద్దాం.
యెహోషువ 9:1-27; 10:1-5.

యెహోషువ, గిబియోనీయులు


ప్రశ్నలు

  • గిబియోనుకు చెందిన ప్రజలు దగ్గర్లోని పట్టణాలకు చెందిన కనానీయులకు ఎలా భిన్నంగా ఉన్నారు?
  • చిత్రంలో చూపించబడినట్లుగా గిబియోనీయులు ఏమి చేశారు, వాళ్ళు ఎందుకలా చేశారు?
  • యెహోషువ మరియు ఇశ్రాయేలు నాయకులు గిబియోనీయులకు ఏమని ప్రమాణం చేశారు, మూడు రోజుల తర్వాత వాళ్ళకు ఏమి తెలిసింది?
  • గిబియోనీయులు ఇశ్రాయేలుతో సమాధానపడ్డారని ఇతర పట్టణాల్లోని రాజులకు తెలిసినప్పుడు ఏమి జరిగింది?

అదనపు ప్రశ్నలు

  • యెహోషువ 9:1-27 చదవండి.
    ‘ఈ దేశ నివాసులనందరినీ నశింపజేయండి’ అని యెహోవా ఇశ్రాయేలు జనాంగానికి ఆజ్ఞాపించినా ఆ తర్వాత ఆయన గిబియోనీయులను విడిచిపెట్టడంలో ఆయనకున్న ఏ లక్షణాలు ప్రత్యేకంగా వెల్లడయ్యాయి? (యెహో. 9:22, 24; మత్త. 9:13; అపొ. 10:34, 35; 2 పేతు. 3:9)
    యెహోషువ గిబియోనీయులకు తాను చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉండడం ద్వారా నేటి క్రైస్తవులకు ఎలా ఒక చక్కని మాదిరిని ఉంచాడు? (యెహో. 9:18, 19; మత్త. 5:37; ఎఫె. 4:25)
  • యెహోషువ 10:1-5 చదవండి.
    నేడు గొప్ప సమూహం గిబియోనీయులను ఎలా అనుకరిస్తున్నారు, దానివల్ల వాళ్ళు దేనికి గురవుతున్నారు? (యెహో. 10:2; జెక. 8:23; మత్త. 25:35-40; ప్రక. 12:17)

ఇశ్రాయేలులో దొంగ




తాను దొంగిలించినదాన్ని దాచిపెడుతున్న ఆకాను
ఈ వ్యక్తి తన గుడారంలో ఏమి పాతిపెడుతున్నాడో చూడండి! ఒక చక్కని వస్త్రము, బంగారు కమ్మి, కొన్ని వెండి ముక్కలు దాచిపెడుతున్నాడు. అతను వాటిని యెరికోనుండి తీసుకున్నాడు. నిజానికి యెరికోలోని వస్తువులను ఏమి చెయ్యాలి? మీకు జ్ఞాపకం ఉందా?
వాటిని నాశనం చెయ్యాలి. బంగారము, వెండిని మాత్రం యెహోవా గుడారపు ధనాగారానికి ఇవ్వాలి. కానీ ఈ వ్యక్తులు యెహోవాకు అవిధేయత చూపించారు. వాళ్ళు దేవుని సొత్తును దొంగిలించారు. ఆ వ్యక్తి పేరు ఆకాను. అతనితోపాటు ఉన్నవారు అతని కుటుంబ సభ్యులు. ఆ తర్వాత ఏమి జరిగిందో చూద్దాం.
ఆకాను వాటిని దొంగిలించిన తర్వాత, యెహోషువ కొంతమందిని హాయి పట్టణముతో యుద్ధం చేయడానికి పంపించాడు. కానీ వాళ్ళు యుద్ధంలో ఓడిపోయారు. కొందరు చంపబడ్డారు, మిగిలినవారు పారిపోయి వచ్చేశారు. యెహోషువ చాలా బాధపడ్డాడు. ఆయన తన ముఖాన్ని నేలకు వంచి, ‘ఎందుకు ఇలా జరగనిచ్చావు?’ అని యెహోవాకు ప్రార్థించాడు.
అందుకు యెహోవా, ‘ఇశ్రాయేలీయులు నా ఎదుట పాపము చేశారు. నాశనం చేయవలసిన వాటిని, యెహోవా గుడారానికి ఇవ్వవలసిన వాటిని వాళ్ళు ఉంచుకున్నారు. ఒక చక్కని వస్త్రాన్ని దొంగిలించి దాన్ని రహస్యంగా దాచిపెట్టారు. నువ్వు వాటిని, వాటిని తీసుకున్న వ్యక్తిని నాశనం చేసేంతవరకు నేను మిమ్మల్ని ఆశీర్వదించను’ అని సమాధానమిచ్చాడు. ఆ చెడ్డ వ్యక్తి ఎవరో నేను చూపిస్తానని కూడా యెహోవా యెహోషువతో చెప్పాడు.
కాబట్టి యెహోషువ ప్రజలందరిని సమకూర్చినప్పుడు యెహోవా చెడ్డవాడైన ఆకానును వేరుచేశాడు. అప్పుడు ఆకాను, ‘నేను పాపము చేశాను. ఒక చక్కని వస్త్రాన్ని, బంగారు కమ్మిని, వెండి ముక్కలను నేను చూశాను. అవి నాకు ఎంతో నచ్చాయి కాబట్టి వాటిని తీసుకున్నాను. నేను వాటిని నా గుడారం లోపల పాతిపెట్టాను’ అని చెప్పాడు.
ఆ వస్తువులు యెహోషువ దగ్గరకు తీసుకురాబడినప్పుడు ఆయన ఆకానుతో, ‘నువ్వు మమ్మల్ని ఎందుకు కష్టపెట్టావు? ఇప్పుడు యెహోవా నిన్ను కష్టపెడతాడు!’ అన్నాడు. అప్పుడు ప్రజలంతా ఆకానును, అతని కుటుంబాన్ని రాళ్ళతో కొట్టి చంపారు. మనవి కాని వస్తువులను మనం ఎన్నడూ తీసుకోకూడదని ఇది చూపడం లేదా?
తర్వాత ఇశ్రాయేలీయులు మళ్ళీ హాయితో యుద్ధం చేశారు. ఈసారి యెహోవా తన ప్రజలకు సహాయం చెశాడు, వాళ్ళు యుద్ధంలో జయించారు.
యెహోషువ 7:1-26; 8:1-29.


ప్రశ్నలు

  • చిత్రంలో యెరికోనుండి తీసుకోబడిన విలువైన వస్తువులను పాతి పెడుతున్న వ్యక్తి ఎవరు, ఆయనకు సహాయం చేస్తున్న వాళ్ళు ఎవరు?
  • ఆకాను, అతని కుటుంబం చేసిన ఆ పని ఎందుకు అంత గంభీరమైనది?
  • హాయివద్ద జరిగిన యుద్ధంలో ఇశ్రాయేలీయులు ఓడిపోవడానికిగల కారణమేమిటని యెహోషువ అడిగినప్పుడు యెహోవా ఏమి చెప్పాడు?
  • ఆకాను, అతని కుటుంబం యెహోషువ దగ్గరకు తీసుకురాబడినప్పుడు, వాళ్ళకేమి జరిగింది?
  • ఆకానుకు ఇవ్వబడిన తీర్పు మనకు ఏ ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తోంది?

అదనపు ప్రశ్నలు

  • యెహోషువ 7:1-26 చదవండి.
    యెహోషువ ప్రార్థనలు, ఆయనకు యెహోవాతో ఉన్న సంబంధం గురించి ఏమి వెల్లడి చేశాయి? (యెహో. 7:7-9; కీర్త. 119:145; 1 యోహా. 5:14)
    ఆకాను ఉదాహరణ ఏమి చూపిస్తోంది, అది మనకు ఒక హెచ్చరికగా ఎలా ఉంది? (యెహో. 7:11, 14, 15; సామె. 15:3; 1 తిమో. 5:24; హెబ్రీ. 4:13)
  • యెహోషువ 8:1-29 చదవండి.
    నేడు క్రైస్తవ సంఘంపట్ల మనకు ఎలాంటి వ్యక్తిగతమైన బాధ్యత ఉంది? (యెహో. 7:13; లేవీ. 5:1; సామె. 28:13)

యెరికో గోడలు


యెరికో గోడలు అలా ఎందుకు కూలిపోతున్నాయి? ఏదో ఒక పెద్ద బాంబు వాటిని కూల్చేస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఆ రోజుల్లో బాంబులు లేవు; కనీసం తుపాకులైనా లేవు. అది యెహోవా చేసిన మరో అద్భుత కార్యం! అసలు అది ఎలా జరిగిందో చూద్దాం.

కూలిపోతున్న యెరికో గోడలు
యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు: ‘నువ్వు, నీతోపాటు నీ యుద్ధశూరులు పట్టణం చుట్టూ తిరగాలి. రోజుకు ఒకసారి చొప్పున ఆరు రోజులు తిరగాలి. మీతోపాటు నిబంధన మందసాన్ని తీసుకు వెళ్ళాలి. ఏడుగురు యాజకులు దాని ముందు నడుస్తూ తమ బూరలు ఊదాలి.
‘ఏడవ రోజున పట్టణం చుట్టూ ఏడుసార్లు తిరగాలి. తర్వాత బూరలు ఊదుతూ ప్రతి ఒక్కరు యుద్ధ కేకలు వేయాలి. అప్పుడు గోడలు కూలిపోతాయి!’
యెహోషువ, ప్రజలు యెహోవా చెప్పినట్లు చేశారు. వాళ్ళు పట్టణం చూట్టూ తిరిగేటప్పుడు నిశ్శబ్దంగా నడిచారు. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. కేవలం బూరల శబ్దం, వాళ్ళ అడుగుల చప్పుడు మాత్రమే వినిపించింది. యెరికోలోని దేవుని ప్రజల శత్రువులు తప్పకుండా భయపడి ఉంటారు. ఒక కిటికీలోనుండి వ్రేలాడుతున్న ఎర్రని తాడు మీకు కనిపించిందా? ఆ కిటికీ ఎవరిది? అవును, రాహాబు ఆ ఇద్దరు వేగులవాళ్ళు చెప్పినట్లు చేసింది. ఆమె కుటుంబమంతా ఆమెతోపాటు ఇంట్లోనే ఉండి ఎదురు చూశారు.

యెహోషువ
చివరకు ఏడవ రోజున పట్టణం చుట్టూ ఏడుసార్లు తిరిగిన తర్వాత, యాజకులు బూరలు ఊదారు, యుద్ధశూరులు కేకలు వేశారు, గోడలు కూలిపోయాయి. అప్పుడు యెహోషువ, ‘పట్టణంలోని ప్రతి ఒక్కరిని చంపేసి, పట్టణాన్ని కాల్చివేయండి. పూర్తిగా కాల్చివేయండి. వెండి, బంగారం, ఇత్తడి, ఇనుమును మాత్రం మిగిల్చి యెహోవా గుడారపు ధనాగారములో ఉంచండి’ అని చెప్పాడు.
ఆ ఇద్దరు వేగులవాళ్ళతో యెహోషువ, ‘మీరు రాహాబు ఇంటికి వెళ్ళి, ఆమెను ఆమె ఇంటివారిని బయటకు తీసుకొని రండి’ అని చెప్పాడు. వేగులవాళ్ళు వాగ్దానం చేసినట్లు రాహాబు, ఆమె కుటుంబం రక్షించబడింది.
యెహోషువ 6:1-25.


ప్రశ్నలు

  • యుద్ధశూరులు మరియు యాజకులు ఆరు రోజులపాటు ఏమి చేయాలని యెహోవా చెప్పాడు?
  • ఆ పురుషులు ఏడవ రోజున ఏమి చేయాలి?
  • మీరు చిత్రంలో చూస్తున్నట్లుగా యెరికో గోడలకు ఏమి జరిగింది?
  • ఒక కిటికీలోనుండి ఎర్ర తాడు ఎందుకు వ్రేలాడుతోంది?
  • యెరికోలోని ప్రజలను మరియు ఆ పట్టణాన్ని ఏమి చేయమని, కానీ వెండిని, బంగారాన్ని, ఇత్తడిని, ఇనుమును ఏమి చేయమని యెహోషువ యుద్ధశూరులకు చెప్పాడు?
  • ఇద్దరు వేగులవాళ్ళకు ఏమి చేయమని చెప్పబడింది?

అదనపు ప్రశ్నలు

  • యెహోషువ 6:1-25 చదవండి.
    ఇశ్రాయేలీయులు యెరికో చుట్టూ ఏడు రోజులపాటు తిరగడం, ఈ అంత్యదినాల్లో యెహోవాసాక్షులు చేస్తున్న ప్రకటనా పనికి ఎలా పోలివుంది? (యెహో. 6:15, 16; యెష. 60:22; మత్త. 24:14; 1 కొరిం. 9:16)
    యెహోషువ 6:26లో వ్రాయబడిన ప్రవచనం దాదాపు 500 సంవత్సరాల తర్వాత ఎలా నెరవేరింది, అది మనకు యెహోవా వాక్యం గురించి ఏమి బోధిస్తోంది? (1 రాజు. 16:34; యెష. 55:11)

యొర్దాను నది దాటడం


చూడండి! ఇశ్రాయేలీయులు యొర్దాను నది దాటుతున్నారు! మరి నదిలోని నీళ్ళు ఏవి? సంవత్సరంలోని ఆ సమయంలో వర్షాలు బాగా పడతాయి కాబట్టి అప్పటివరకూ నది పొంగి పొర్లింది. అయితే కొద్ది నిమిషాల్లోనే నీళ్ళు లేకుండా పోయాయి! ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రంలో నడిచినట్లే ఎండిన నేలపై నడిచి వెళ్తున్నారు! నీళ్ళన్ని ఎక్కడికి పోయాయి? చూద్దాం.

యొర్దాను నదిని దాటుతున్న ఇశ్రాయేలీయులు
ఇశ్రాయేలీయులు యొర్దాను నది దాటే సమయం వచ్చింది. అప్పుడు ‘యాజకులు నిబంధన మందసాన్ని తీసుకొని ముందుగా నడవాలి. వాళ్ళు తమ పాదాలను యొర్దాను నది నీళ్ళలో పెట్టిన వెంటనే నీళ్ళ ప్రవాహం ఆగిపోతుంది’ అని ప్రజలకు చెప్పమని యెహోవా యెహోషువకు చెప్పాడు.
కాబట్టి యాజకులు నిబంధన మందసాన్ని ఎత్తుకొని ప్రజలకు ముందుగా నడిచారు. యొర్దాను దగ్గరకు వచ్చినప్పుడు యాజకులు నీటిలో అడుగు పెట్టారు. ఆ నది ఎంతో వేగంగా, లోతుగా ప్రవహిస్తుంది. అయితే వాళ్ళ పాదాలు నీళ్ళను తాకగానే నీళ్ళ ప్రవాహం ఆగిపోయింది! అద్భుతం! ప్రవహిస్తున్న నీళ్ళను యెహోవా నిలిపివేశాడు. వెంటనే నదిలో నీళ్ళు ఇంకిపోయాయి!
నిబంధన మందసాన్ని మోసుకెళ్తున్న యాజకులు ఎండిన నది మధ్య భాగంలోకి వెళ్ళారు. వాళ్ళు చిత్రంలో మీకు కనిపిస్తున్నారా? వాళ్ళు అక్కడ నిలబడి ఉండగా ఇశ్రాయేలీయులంతా ఎండిన యొర్దాను నది నేలపై నడిచి వెళ్ళారు!
అందరూ దాటిపోయిన తర్వాత బలంగల 12 మంది వ్యక్తులకు యెహోవా యెహోషువతో ఇలా చెప్పించాడు: ‘యాజకులు నిబంధన మందసమును ఎత్తుకొని నిలబడిన చోటికి వెళ్ళి అక్కడనుండి 12 రాళ్ళను తీసుకొని వచ్చి ఈ రాత్రి మీరు బసచేసే స్థలంలో నిలబెట్టండి. భవిష్యత్తులో మీ కుమారులు ఈ రాళ్ళు ఏమిటని అడిగినప్పుడు, యెహోవా నిబంధన మందసము యొర్దానును దాటినప్పుడు నీళ్ళు నిలిచిపోయాయని మీరు చెప్పాలి. ఈ రాళ్ళు మీకు ఈ అద్భుతాన్ని గుర్తు చేస్తాయి!’ నది అడుగు భాగాన యాజకులు నిలబడిన చోట కూడా యెహోషువ 12 రాళ్ళను నిలబెట్టించాడు.

యెహోషువ
చివరకు యెహోషువ, ‘యొర్దానును దాటండి’ అని నిబంధన మందసమును మోస్తున్న యాజకులతో చెప్పాడు. వాళ్ళు అలా దాటిన వెంటనే నది మళ్ళీ ప్రవహించడం ప్రారంభించింది.
యెహోషువ 3:1-17; 4:1-18.


ప్రశ్నలు

  • ఇశ్రాయేలీయులు యొర్దాను నది దాటడానికి వీలుగా యెహోవా ఏ అద్భుతం చేశాడు?
  • యొర్దాను నది దాటాలంటే ఇశ్రాయేలీయులు తమ విశ్వాసాన్ని చర్యల్లో ఎలా చూపించాల్సి వచ్చింది?
  • నది మధ్యనుండి 12 పెద్ద రాళ్ళను తీసుకొమ్మని యెహోవా యెహోషువకు ఎందుకు చెప్పాడు?
  • యాజకులు యొర్దాను నదినుండి బయటకు రాగానే ఏమి జరిగింది?

అదనపు ప్రశ్నలు

  • యెహోషువ 3:1-17 చదవండి.
    ఈ వృత్తాంతం ద్వారా ఉదహరించబడినట్లు, మనకు యెహోవా సహాయం, ఆశీర్వాదం లభించాలంటే మనమేమి చేయాలి? (యెహో. 3:13, 15; సామె. 3:5; యాకో. 2:22, 26)
    ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి వెళ్ళడానికి నది దాటవలసి వచ్చినప్పుడు యొర్దాను నది పరిస్థితి ఎలా ఉండింది, అది యెహోవా నామాన్ని ఎలా మహిమపరచింది? (యెహో. 3:15; 4:18; కీర్త. 66:5-7)
  • యెహోషువ 4:1-18 చదవండి.
    యొర్దాను నదినుండి తీసుకోబడి గిల్గాలు వద్ద ఉంచబడిన 12 రాళ్ళు దేనికి గుర్తుగా ఉపయోగపడ్డాయి? (యెహో. 4:4-7, 19-24)

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget